తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజులుగా కేబినెట్ నుంచి తప్పిస్తారని పలు పత్రికల్లో కథనాలు వస్తున్న నేపథ్యంలో.. ఊహాగానాలను కొట్టి పారేస్తూ అనవసర ప్రచారంపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. తనకు మంత్రి పదవి ఎవరి భిక్షతోనో వచ్చింది కాదన్నారు. తాను పార్టీలోకి మధ్యలో వచ్చిన వాడిని కాదని, గులాబీ జెండా ఓనర్లలో ఒకడినని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.
తన రాజకీయ జీవితంలో ఏ ఒక్కరి నుంచైనా రూ.5 వేలు లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. తాను బీసీని కాబట్టి కుల ప్రాతిపదికన మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అడగలేదని స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న చిల్లర ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన పని లేదని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం నేను పోరాటం చేశానని.. ఉద్యమంలో 3.5 కోట్ల ప్రజల తరపున పోరాడానని అన్నారు. నన్ను చంపాలని రెక్కీ నిర్వహించినా తెలంగాణ జెండా పట్టుకొని ఎదురెళ్లానని… తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడిన వ్యక్తినని అన్నారు. పదవులను అడుక్కునే వాడిని అసలే కాదు. నా తల్లిదండ్రులు రాజకీయాల్లో లేకున్నా అనామకుడిగా వచ్చి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. అధికారం శాశ్వతం కాదని ధర్మం, న్యాయం శాశ్వతమని అన్నారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు తప్ప నాయకులు కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సొంతంగా ఎదగలేని వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఎవరు హీరోలో.. ఎవరు జీరోలో త్వరలోనే తెలుస్తుందని ఈటల రాజేందర్ అన్నారు.