కేరళ అటవీశాఖ అధికారులు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్పై కేసు నమోదు చేశారు. ఏనుగు దంతపు కళాఖండాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆయన పై గతంలో ఎర్నాకుళం సమీపంలోని పెరుంభవూర్ కోర్టు అభియోగాలు మోపింది. ప్రస్తుతం ఈ విషయం మాలీవుడ్లో సంచలనంగా మారింది. కాగా 2012కి సంబంధించిన ఈ కేసులో మోహన్ లాల్ ఇంటి నుంచి ఏనుగు దంతపు కళాఖండాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం మోహన్ లాల్ పై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం ఛార్జిషీటు విడుదల చేశారు. ఈ ఛార్జిషీటు పై విచారణ జరిగితే మోహన్ లాల్ చిక్కుల్లో పడ్డట్లేనని మాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే, మరోవైపు ఆయన ఇంటి ముందు యూత్ కాంగ్రెస్ సభ్యులు ధర్నా నిర్వహించారు. మోహన్ లాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ను తిరిగి అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్లోకి తీసుకోవడం వెనుక.. అధ్యక్షుడిగా ఉన్న మోహన్ లాల్ ప్రమేయం ఉందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. మహిళలకు హాని చేస్తున్నవారికి మద్దతు ఇవ్వొద్దంటూ తాజాగా కాంగ్రెస్ యూత్ సభ్యులు ఆయన ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. కాగా ఆ సమయంలో మోహన్ లాల్ ఇంట్లో లేరు. అయితే, తమ అభిమాన నటుడికి హాని తలపెడితే ఊరుకోబోమంటూ.. మోహన్ లాల్ ఫ్యాన్స్.. కాంగ్రెస్ యూత్ సభ్యులకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. దీనిపై స్పందించిన నటుడు దిలీప్, కేసులో తాను నిర్దోషినని తేలే వరకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు దూరంగా ఉంటానని చెప్పాడు.