ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ కార్యాలయం, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వయిరీస్ చైర్మన్, సభ్యుల కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం జీవో నెం.13 విడుదల చేయడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాజధాని అమరావతి నుంచి కార్యాలయాలను ఎందుకు తరలిస్తున్నారో అర్ధం కావటంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించింది అర్ధరాత్రి జీవోలు ఇచ్చేందుకేనా అని ప్రశ్నించారు. అర్ధరాత్రి జీవో జారీ చేయడం నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు. ఇటువంటి చర్యల వల్ల చివరికి బలైపోయేది అధికారులేనని వాపోయారు.
కార్యాలయాలను అమరావతి నుంచి ఎందుకు తరలిస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం అందులో పనిచేసేవారికి సైతం అర్ధం కాకుండా ఉందని విమర్శించారు. ఇలా తరలింపుతో అధికారులు కోర్టు కేసుల్లో ఇరుక్కుంటామనే భయపడుతున్నట్లు తెలుస్తోందని.. వారు ఎంత అభద్రతా భావంతో ఉన్నారో అర్ధమవుతోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం దొడ్డిదారి జీవోలు ఆపాలన్నారు.