యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ అభిమానులకు బంపర్ ఆఫర్. ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాధారణంగా ప్రదర్శించే నాలుగు షోలు కాకుండా అదనంగా రెండు ప్రత్యేక షోలను నిర్వహించనున్నారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 5 వరకు తెల్లవారుజామున 1 గంట నుంచి 10 గంటల మధ్య ఈ షోలను ప్రదర్శిస్తారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ వినతి మేరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
‘బాహుబలి’ బ్లాక్బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా ఇది. ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. తెలుగు, హిందీతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్కు విశేషమైన స్పందన లభించింది. సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.