ధర్మకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఆ తరువాత షూటింగ్ జరుగుతుండగానే కరోనా ఎఫెక్ట్తో బ్రేక్ పడింది. ఫలితంగా షూటింగు నిలిచిపోయింది. లాక్ డౌన్ ప్రభావం షూటింగుపై .. విడుదల తేదీపై పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా చెప్పినట్టుగా ఈ సినిమా జనవరి 8వ తేదీన విడుదల కాకపోవచ్చని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య ఒక ఆంగ్ల దిన పత్రికతో మాట్లాడుతూ, లాక్ డౌన్ కారణంగా ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఇప్పటికే గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా వరకూ పూర్తయిందనీ, ముందుగా చెప్పిన ప్రకారమే ఈ సినిమాను జనవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు.