తమిళ ప్రముఖ నటుడు సూర్య నటించిన ‘కాప్పాన్’ సినిమా చిక్కుల్లో పడింది. ఈ సినిమా కథ తనదని రచయిత జాన్ చార్లెస్ ఆరోపించారు. కేవీ ఆనంద్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. మోహన్లాల్, ఆర్య, సాయేషా సైగల్ కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించారు. సెప్టెంబరు 20న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్కు మంచి స్పందన లభించింది.
కాగా ఈ కథ తనదంటూ మద్రాస్ హైకోర్టులో జాన్ చార్లెస్ పిటిషన్ వేశారు. ‘సరవేది’ టైటిల్తో తను రాసుకున్న కథతో ఆనంద్ చిత్రం తీశారని ఆరోపించారు. 2017లో ఈ సినిమా కథను ఆనంద్కు నరేట్ చేశానని, రెండేళ్లుగా ఆయన స్పందన కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. కానీ ఇటీవల వచ్చిన ‘కాప్పాన్’ ట్రైలర్ చూసి షాక్ అయ్యానని తెలిపారు. కాపీరైట్ ఫీజుతోపాటు కథకు క్రెడిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబరు 4న ఈ కేసు వాదోపవాదాలను కోర్టు విననుంది. ఇంకా ఈ వివాదంపై చిత్ర బృందం స్పందించలేదు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ కథను కాపీ కొట్టే అంశం గురించి ప్రస్తావించారు. ‘నా వద్ద ఓ కథ ఉంది. విని మీ అభిప్రాయం చెప్పండి’ అని ఎవరైనా అడిగితే, ఏ మాత్రం మొహమాటం లేకుండా వద్దని చెప్పేస్తా. వింటే.. వారి కథలోని ఓ సన్నివేశం నా సినిమాలో ఉంటే ఆ సన్నివేశాన్ని తొలగించాల్సి వస్తుంది. లేకుంటే.. నా కథ విని, అందులోని సన్నివేశాలను కాపీ చేశారని జెండా పట్టుకొస్తారు. అందుకే ఎవరి కథలు వినడం లేదు’ అని అన్నారు.