నాగచైతన్య-సమంత జోడీ విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఈ ప్రకటనపై అక్కినేని కుటుంబానికి చెందిన పలువురు తారలు.. సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు వాళ్లిద్దరూ విడిపోవడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా నటుడు వెంకటేశ్ పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘మనం ఏదైనా విషయంపై పెదవి విప్పే ముందు దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి’ అంటూ వెంకీ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజా పరిస్థితులకు అనుగుణంగానే ఆయన ఈ పోస్ట్ పెట్టారా? అని అందరూ మాట్లాడుకుంటున్నారు.
సమంత, చైతన్య నిర్ణయంపై తాజాగా సమంత తండ్రి స్పందించారు. వాళ్ల జోడీ చూడముచ్చటగా ఉండేదని.. అలాంటిది, ఇప్పుడు వాళ్లిద్దరూ విడిపోవడం దురదృష్టకరమని అన్నారు. అంతేకాకుండా.. వాళ్లిద్దరూ విడిపోతున్నారని తెలిసి మైండ్ బ్లాంక్ అయ్యిందని.. ఏం చేయాలో అర్థం కాలేదని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నట్లు వివరించారు.