సుధీర్బాబు హీరోగా , బాలీవుడ్ నటి అదితి రావ్ హైదరి హీరోయినగా నటిస్తున్న సినిమా ‘సమ్మోహనం’. ఈ చిత్రం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ను ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు.
‘అసలేముందిరా ఈ స్టార్లలో… నటన అబద్ధం, గ్లామర్ అబద్ధం, మాటలు అబద్ధం. అయినా ఎగబడతారేంట్రా?’ అంటూ సుధీర్బాబు డైలాగ్ చెప్పడంతో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ‘స్టార్ట్ కెమెరా..రోలింగ్…యాక్షన్’ అంటూ ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ అతిథి పాత్రలో కన్పించారు. ‘స్టార్లు మాములు మనుషులు కారు. వాళ్లను చూడ్డానికి మనం డబ్బులిచ్చి థియేటర్కు వెళుతున్నామంటే మనలో లేనిది వారిలో ఏదో ఉంది’ అంటూ ఓ హస్యనటుడు..సుధీర్తో చెప్తూ కన్పించారు. సుధీర్ బాబుకు బొమ్మలు వేయడం అంటే ఇష్టం. ‘నా ఆర్ట్ చిన్న పిల్లలకు ఆనందాన్నిస్తుంది నాన్నా..వాళ్ల ఇమాజినేషన్ను పెంచుతుంది. సినిమాలు.. ఆ ప్రపంచమే నరకం నాన్నా’ అని సుథీర్ బాబు నరేశ్తో చెప్తున్న డైలాగ్ హైలైట్గా నిలిచింది. ఇందులో అదితి రీల్ లైఫ్ లోనూ కథానాయికగానే చేసింది. ‘తెలుగు రానప్పుడు తెలుగు సినిమాలు ఎందుకు చేయాలి?’ అంటూ సుధీర్ అదితిని కామెంట్ చేయడం ఫన్నీగా ఉంది.
అదితి, సుధీర్ ప్రేమించుకోవడం ఆ తర్వాత ఇద్దరూ విడిపోవడంతో ‘సినిమా వాళ్ల మీద నాకున్న అభిప్రాయం తప్పనుకున్నా నిన్నకలిసిన తర్వాత . కాదని చెంప పగలగొట్టి మరీ నిరూపించావ్ మనుషుల్ని వాడుకోవడం మీ ప్రొఫెషన్లో చాలా సాధారణం అనుకుంటా’ అని సుధీర్ అంటారు. ఈ ట్రైలర్ను బట్టి చూస్తే సినిమాలోనే మరో సినిమా ప్రపంచాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తుంది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్పై శివలెంక కృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జూన్ 15 న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.