తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీ వల్ల ఎలాంటి లాభం లేదని, దీని కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్న డబ్బు వృథా అవుతోందని అన్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని అన్నారు. పోలీసుల ప్రవర్తన సరిగ్గా లేదని ఆయన తప్పుబట్టారు. జైల్లో ఉన్నవారు 90 శాతంమంది పేదవారేనని, తినడానికి తిండి కూడా లేనివారే జైళ్లలో మగ్గుతున్నారని ఆయన తెలిపారు. మరికొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వచ్చామో కూడా తెలియదని అన్నారు. ఈ నేపథ్యంలో పోలీసు అకాడమీలో ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న ఐపీఎస్లు సైతం ప్రజల్లో పోలీసులపై ఉన్న అభిప్రాయాన్ని మార్చలేకపోతున్నారని.. దేశంలోని పోలీస్ అకాడమీలన్నీ డంపింగ్ యార్డ్లుగా మారాయని ఆరోపించారు. ఈ అకాడమీల్లో పోలీసులు తీసుకుంటున్న శిక్షణతో సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. జైలుకు వచ్చే నేరస్తులు తోటి ఖైదీలను చూసి నేరాలు చేయడంలో కొత్త టెక్నిక్స్ నేర్చుకొంటున్నారని అన్నారు. పోలీసులు సామాజిక కార్యకర్తలగా వ్యవహరించాలి. డబ్బు, అధికారం ఉన్న వాళ్ళతోటే పోలీసులు స్నేహంగా ఉంటున్నారు. బ్రిటీష్ కాలం నాటి ఆనవాయితీ ఇంకా కొనసాగుతోందని ఆరోపించారు.
గతంలోనూ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా ఉన్న వీకే సింగ్ను ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసి.. పోలీస్ అకాడమీ డైరెక్టర్గా నియమించిన సంగతి తెలిసిందే. ప్రిటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఉన్న సమయంలోనూ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతో బంగారు తెలంగాణ రాదని, తెలంగాణ కోసం ఓ మిషన్ను ఏర్పాటు చేస్తున్నట్టు గతంలో ప్రకటించారు.